
ఖమ్మం టౌన్, వెలుగు : ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు వంట సిబ్బంది ప్రేమతో నాణ్యమైన పోషకాహారం అందించాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. బుధవారం రఘునాథపాలెం మండలం కోయచెలక క్రాస్ రోడ్ వద్ద ఉన్న గురుకులంలో జిల్లాలోని సాంఘీక సంక్షేమ శాఖ, విద్యాశాఖ పరిధిలో నడిచే నివాస విద్యా సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న వంట సిబ్బందికి నైపుణ్య మెరుగుదల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు.అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఆరోగ్యవంతమైన, రుచికరమైన ఆహారం అందించడంలో వంట సిబ్బంది పాత్ర ఎంతో కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘీక సంక్షేమ అధికారి కస్తాల సత్యనారాయణ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి ఎన్. విజయలక్ష్మి, పుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.